పోడు భూములపై పౌర హక్కుల సంఘం
నిజ నిర్ధారణ రిపోర్ట్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో తేదీ 04/09/2021 నాడు నిజామాబాద్ జిల్లా, బీంగల్ మండలం లోని గంగరాయి తండా,కారేపల్లి తండా లను సందర్శించింది. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను, గిరిజనేతరులను భూమి నుండి భేdకల్ చేయడానికి ప్రభుత్వం అటవీ శాఖ అధికారులతో వేదింపులకు గురిచేస్తున్నది.
గంగారాయి తండాలో మాలవత్ జ్యోతి అటవీ బీట్ అధికారి సునీత వేధింపుల వలన తేదీ 02/09/2021 నాడు పంట చేనుకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.తరువాత ఆమె బంధువులు బీంగల్ లోని బాలాజీ దవాఖానలో చేర్చి వైద్యం చేయించడం వలన ఆమె ప్రాణాలతో బయట పడింది.ఈ సంఘటనను పౌర హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.దీంతో జ్యోతి ఇంటి వద్దకు వెళ్లి ఆమెను పర్మర్శించింది.ఆమె కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించింది.జ్యోతి అత్మహత్యయత్నం కు కారణమైన వాటిని అడిగి తెలుసుకున్నాం.
జ్యోతి భర్త దేవేందర్ గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కొరకు వెళ్ళినాడు. దేవేందర్ తండ్రి తావుర్యా కు నల్గురు కొడుకులు. తావుర్యా గత 30 సంవత్సరాలుగా సాగుచేసిన అడవి భూమిని అతని కొడుకులకు ఇచ్చినాడు. జ్యోతి భర్త దేవేందర్ 3 ఎకరాలు పోడు వ్యవసాయంతో ఇద్దరు అమ్మాయిల్ని పెంచి పోషించి, పెండ్లిలు చేయడం సాధ్యం కాదని, ఉపాధి కోసమే గల్ఫ్ దేశాలు వెళ్లినాడు. అక్కడ పని లేక రెండు సార్లు తిరిగి దేశానికి వచ్చి మళ్లీ గల్ఫ్ వెళ్ళినాడు. గల్ఫ్ వెళ్ళడానికి అప్పులకు అప్పు వడ్డీలు పెరిగి పోయినాయి. ఉన్న పోడు వ్యవసాయం జ్యోతి సాగు చేస్తున్నది. కరోనా కారణంగా కొద్ది రోజులు ఎవరిని బయటకు రాకుండా కట్టడి చేయడం వలన ఖరీఫ్ 2021 లో వెంటనే పంట వేయలేదు.వర్షాలు మొదలైనందున తిరిగి పంట వేయడానికి దుక్కి దున్నే సమయంలో ఫారెస్ట్ బీట్ అధికారి సునీత అడ్డుకుంది.గత రెండు నెలలుగా 10 సార్లు భూమి వద్దకు సునీత వచ్చి జ్యోతి పంట వేయకుండా అడ్డుకుంది.రెండు నెలలుగా బీంగల్ పోలీస్ స్టేషన్ కు జ్యోతిని 4 సార్లు పిలిచారు.పోలీసులు సునీత వస్తుంది. కాబట్టి ఉండమని చెప్పి సాయంత్రం వరకు స్టేషన్ లో ఉంచుకుని పంపించారని జ్యోతి మాతో చెప్పి ఏడ్చింది.
జ్యోతి, ఆమె పిల్లలు, దర్మి, తవుర్యా ప్రతి రోజు ఉదయం భోజనం చేసి సద్ది కట్టుకొని చేను వద్దకు వెళ్లి కాపలా ఉన్నారు. చేనులోకి ఫారెస్ట్ వారు వచ్చి చెట్లు నాటేందుకు వచ్చిన ప్రతి సారి అడ్డుకోవడం, కాపలా ఉండటం సాయంత్రము ఇంటికి రావడం రెండు నెలలుగా జరిగింది. తేదీ 02/09/2021 నాడు బీట్ అధికారి సునీత బీహార్ కూలీలను తీసుక వచ్చి హరిత హారం చెట్లు నాటడానికి చెట్లు తీసుకువచ్చి వీరి పంట చేనులో వేసినారు. చెట్లు నాటడం కొరకు కూలీలతో వీరి భూమిలో గుంతలు తవ్వుతుండగా జ్యోతి,ఆమె ఇద్దరు ఆడ పిల్లలు, మామ తావూర్య, అత్త దర్మీ కూలీలను అడ్డుకున్నారు. సునీత,ఇంకా కొందరు మగ వారు కూలీలతో గుంతలు త్రవ్వుతుండగా సునీతను బ్రతిమిలడినారు.సునీత (లంబాడా) యస్.టి అయి ఉండి కనికరం చూపలేదు. ఆడ పిల్లలు సునీత కాళ్ళు పట్టుకుంటే ఆమె వారిని కాళ్ళతో తన్నింది. ఫారెస్ట్ అధికారుల కోసం పిల్లల్ని కన్నవా అని ధర్మిని సునీత అన్నదని ధర్మీ నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పి ఆవేదన చెందింది. ఇకా చేసేది లేక మామ తావుర్య అడవిలో ఉరేసు కోవడానికి గుట్ట పైకి ఎక్కినాడు. ధర్మి అతన్ని వేతకడానికి వెళ్ళింది.జ్యోతి భర్తకు ఫోన్ చేసి జరుగుతున్న విషయం చెప్పి సునీత ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చింది.
దీంతో అతను ఆమెకు ఫోన్ చేసి మాకు బ్రతకడానికి ఉన్న ఈ కాస్తా భూమి పోతే ఆడ పిల్లల పెండ్లిలు చేయడం సాధ్యం కాదని, వారి పేండ్లిలు తరువాత నేనే మీకు భూమిని స్వాధీనం చేస్తానని చెప్పాడు.అయిన కానీ సునీత కనికరించలేదు.చివరికి జ్యోతి భూమి పోతుందని,గత సంవత్సరం అదే భూమిలో పత్తి పంటకు కొట్టిన పురుగుల మందు మిగిలింది అక్కడే చేనులో ఉన్నది తీసుకొని త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సునీత గాని,వారి సిబ్బంది కానీ జ్యోతిని దవాఖానకు తీసుక వెళ్లే ప్రయత్నం చేయలేదు.జ్యోతి బంధువులు ఆమెను బీంగల్ లోని బాలాజీ దవాఖానకు వెంటనే తీసుకురావడం వలన ఆమె ప్రాణాలు దక్కినవి. రెండు రోజులు దవాఖానలో ఆమె ఉంటే అటవీ అధికారులు సందర్శించ లేదు. ఆర్థిక సహాయం చేయలేదు.రెవెన్యూ అధికారులు ఈ సంఘటన పై విచారణ చేయలేదు.
జ్యోతి, వారి కుటుంబ సభ్యులు సాగుచేస్తున్న పోడు భూములను నిజనిర్ధారణ బృందం సందర్శించి పర్శీలించింది.జ్యోతి భర్త దేవేందర్, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి భూమిని వరి పంట సాగు కోసం చదును చేశారు. కానీ ఫారెస్ట్ అధికారులు వాటిని అడవి భూములు అని అంటూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడానికి పూనుకొని మొక్కలు డంప్పు చేశారు. దీని వలన జ్యోతి,ఆమె కుటుంబ సభ్యులకు మరింత ఆవేదన, భయం వ్యక్తం కావడానికి కారణం అయ్యింది.
కారేపల్లి తండాను కూడా నిజ నిర్ధారణ బృందం సందర్శించి గిరిజనులతో మాట్లాడి వివరాలు సేకరించింది. సర్వే నంబర్ 44 లో 3600 ఎకరాలు ప్రభుత్వ భూమి నుండి 1200 ఎకరాలు గిరిజనులు సాగు చేస్తున్నారు.కొందరికి రెవెన్యూ అధికారులు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.వీరు వీటితో పాటుగా ఫారెస్ట్ భూములను సాగు చేసుకొని వారి తాత ముత్తాతలు నుండి పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.
ఇక్కడ కూడా ఫారెస్ట్ అధికారులు గిరిజనులను భూముల్లోకి రానివ్వడం లేదు. రెవెన్యూ పట్టా భూములను కూడా ఫారెస్ట్ భూములని ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారు. భూముల్లో బోరు బావులు త్రవ్వకుండ ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారు అని నిజనిర్ధారణ బృందం ముందు వారు తెలిపారు. ఫారెస్ట్ భూములకు ఫారెస్ట్ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం బలవంతంగా గిరిజనులను భూముల నుండి తరిమి వేసే ప్రయత్నం చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
గంగారాయి తండాలో గిరిజనులు వందల ఎకరాలు వారి తాత ముత్తాతలు నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వం హరిత హారం పేరుతో తెలంగాణ జిల్లాల్లోని ఆదివాసులు,గిరిజనులు సాగుచేసుకుంటున్న ఫారెస్ట్ భూములను ప్రభుత్వం బలవంతంగా వారి నుండి స్వాధీనం చేసుకుని గిరిజనుల,అది ఆదివాసుల జీవించే హక్కును హరించి వేస్తుందని అడవి బిడ్డలైన గిరిజనులు, పౌర హక్కుల సంఘం భావిస్తున్నది.
నిజ నిర్ధారణ బృందం లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, రాష్ట్ర నాయకలు న్యాయవాది వి. సంగం, జిల్లా అధ్యక్షుడు మువ్వా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయవాది ఆల్గొ ట్ రవీందర్, జిల్లా నాయకులు కొంగర శ్రీనివాస్ రావు, కేతావత్ ప్రేమ్ సింగ్, కేతావత్ భీక్ సింగ్, గుఱ్ఱం జెలేందర్, న్యాయవాది కే. శ్రీనివాస్, ప్రవీణ్, కృష్ణంరాజు, పీ.డీ.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
Comments
Post a Comment