దళిత రైతులకు వెంటనే పట్టాలివ్వాలి | సి ఎల్ సి, తెలంగాణ

గర్జనపల్లి దళితుల పోడుభూములను లాక్కొని ప్లాంటేషన్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.....

గర్జనపల్లి గ్రామంలో,వీర్నపల్లి మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడుభూములు సాగుచేస్తున్న 200 మంది దళితులపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో 12 సెప్టెంబర్,2021ఆదివారంన పోలీసులు & ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి పంటలను పీకి, ధ్వంసం చేసి ప్లాంటేషన్ మొక్కలు నాటిన ఘటన పై, పౌర హక్కుల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ మరియు పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీలు సంయుక్తంగా 26 ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు,గర్జనపల్లి గ్రామంలో, ధ్వంసం చేయబడిన పంటలను,భూములను సాగుచేసిన దళిత రైతు కుటుంబాలతో కలిసి పరిశీలించి సెకరించిన నిజనిర్దారణ వివరాలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా,వీర్నపల్లి మండలం, గర్జనపల్లి గ్రామంలో, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 300 వందల దళిత కుటుంబాల ప్రజలు గత 40 సంవత్సరాలుగా బ్రతుకు దెరువు కోసం పగలు రేయి కష్టపడి ఎలుగుబంట్లు అడివిపందులు మరియు ఇతర క్రూర అడివిజంతువుల బారిన ప్రాణాలతో దినదినగండంగా పోరాడి,తమ గ్రామానికి సమీపంలోని అడవిలోని పొట్టిగుట్ట మరియు తుమ్మల కుంట భూముల్లో పోడుచేసుకొని పత్తి,కందులు, మొక్కజొన్న ,వరి మరియు ఇతర పంటలతో జీవిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పుట్టిన మూలవాగు గర్జనపల్లి గ్రామానికి నడిబొడ్డున ఉన్న అమరుల స్తూపం మరియు బస్ స్టాప్ షెల్టర్కు పక్కనుండి గ్రామ ఉత్తర దిశనుండి పొలిమేరల్లో తూర్పు నుండి దక్షిణము వైపు మూల వాగుగుట్ట,పొట్టిగుట్ట మధ్యలో నుండి పోతోంది ప్రవాహం.

ఈ మూలవాగు గర్జనపల్లినుండి ఆగ్నేయంగా నిమ్మపల్లి, వేములవాడ,శభాష్ పల్లి నుండి కొదురపాక దిగువన గోదావరినదికి ఉపనది అయిన మానేరులో కలుస్తుంది.(ఇప్పుడు మిడ్ మానేరు ప్రాజెక్టులో కలుస్తుంది).

ఈ మూలవాగుకు రెండువైపులా ప్రవాహ దిశలో ఉన్న తుమ్మల కుంట 70 ఎకరాల్లో మరియు పొట్టిగుట్ట వద్ద 20 ఎకరాల భూముల్లో 174 దళిత కుటుంబాలు 40 సంవత్సరాల నుండి చెట్లు కొట్టి, రాళ్లు రప్పలు ఏరి కష్ట పడి దున్నుకొన్నారు.తలా 20 గుంటల భూముల్లో పత్తి,కందులు, మొక్కజొన్న మరియు ఇతర పంటలు పండిస్తూ బ్రతుకుతున్నారు.ఈ పోడు భూములు సాగు చేస్తున్న దళితులు కడు పేదవారు, వారికి వేరేఉపాది లేదు.ఈభూములకు దగ్గరికి పోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 6 రోడ్లు స్వంతంగా అందరూ కలిసి వేసుకున్నారు.

వీటికి ప్రభుత్వం బిల్లులు కూడా వచ్చినాయి.సహకార విద్యుత్ సరఫరా సంఘం (Cooperative Electric Supply Society,CESS-Siricilla) ద్వారా బోర్ లకు పంపులకు కరెంట్ కనెక్షన్ కోసం కరెంట్ పోల్ లు,లైన్లు స్వంతంగా రైతులు అమర్చుకోని పోడు వ్యవసాయం చేస్తున్నారు.గత 6 సంవత్సరాల కాలంలో ఈ పొట్టిగుట్ట,భూములను కాపాడుకోవదానికి దొబ్బల రాజయ్య, ఆరెల్లి పోచయ్య మరియు గువ్వల లింగం మరణించారు..గర్జనపల్లి గ్రామం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం లోని గ్రామం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 11 అక్టోబర్ 2016 న రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా ఏర్పడ్డది..

2014లో జరిగిన మొదటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ,7 డిసెంబర్ 2018న రెండవ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్బంగా, ప్రచారంలో స్థానిక సిరిసిల్ల నియోజకవర్గ MLA, రాష్ట్ర మంత్రి KTR గర్జనపల్లి పొడుభూములకు పట్టాలిస్తానని హామీ ఇస్తేనే,TRS పార్టీకి ఓటు వేసి గెలిపించామని, అట్లాగే గర్జనపల్లి MPగా కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ కుమార్ కు(ఇప్పుడు BJP పార్టీ అధ్యక్షుడుగా ఉన్న)పోడు భూముల కు పట్టాలిస్తా నంటే ఓటు వేసామన్నారు గర్జనపల్లి దళితులు.2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పోడు భూములకు పట్టా లివ్వలేదు తెలంగాణ ప్రభుత్వం.

12 సెప్టెంబర్2021 ఆదివారం ఉదయం 6 గంటలకు ముందే గర్జనపల్లి గ్రామాన్ని దిగ్బంధించిన 200 మంది పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పొట్టిగుట్ట, మూలవాగు, తుమ్మలకుంట వైపు ఎవరిని రాకుండా బందో బస్తు పెట్టినారు.చుట్టు పక్కల గ్రామాల నుండి రైతు కూలీలను వెంబడి తీసుకువచ్చి దళితులు సాగు చెస్తున్న భూములలోని పత్తి, కంది, మొక్కజొన్న మొక్కలను పీకివేయించి అడ్డువచ్చిన మహిళలను ఈడ్చుకుంటూ మహిళా పోలీసులు, మగ పోలీసులు పురుషులను అడ్డుకొని బలవంతంగా ప్లాంటేషన్ మొక్కలు పెట్టించారు ఫారెస్ట్ వాళ్ళు. ఈ విద్వాంసానికి నిరసనగా గుంటుక నర్సయ్య అనే రైతుపురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.అతన్ని పోలీస్ జీబులో పోలీసులు ఇంటికి తరలించారు.దువ్వల జమున, గుంటుక లక్ష్మీలు ఈ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడినారు. ఈ ప్లాంటేషన్ మొక్కల వైపు వచ్చి పీకితే 7 సంవత్సరాల జైలు శిక్షా విధిస్థామని బెదిరింపులకు గురిచేసి మొత్తం 90 ఏకరాల్లో ప్లాంటేషన్ చేసినారు.

రైతులు వేసుకున్న మంచెలు పీకి భూముల చుట్టూ బోర్డర్ గా కందకాలు తవ్వినారు.
KCR తెలంగాణ ప్రభుత్వం గర్జనపల్లి దళితుల పోడుభూములను లాక్కొని ప్లాంటేషన్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండిస్తున్నది...
పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీ సాక్షిగా, ఎన్నికల ప్రచారసభల్లో హామిలిచ్చి విరుద్ధంగా పోడు భూముల రైతుల జీవించే హక్కును హరించి వేస్తున్న KCR ప్రభుత్వవైఖరి రాజ్యాంగ విరుద్ధం మరియు అప్రజాస్వామికం...

గర్జనపల్లిలో పొడుచేస్తున్న దళిత రైతులకు వెంటనే పట్టాలివ్వాలి..

గర్జనపల్లిలో పొడుచేస్తున్న దళిత రైతుల పంటల నష్టానికి 50000రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి..
గాయపడ్డ మహిళలకు మెరుగైన వైద్యం అందించాలి.
తెలంగాణ రాష్ట్రం లోని పోడు భూములకు పట్టాలివ్వాలి...

పాల్గొన్నవారు....
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌరహక్కుల సంఘం తెలంగాణ .
2.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ .
3.మాదన కుమారస్వామి,సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ .
4.అల్గోట్ రవిందర్,కోశాధికారి,పౌరహక్కుల సంఘం తెలంగాణ .
5.GAV ప్రసాద్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.పోగుల రాజేశం, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.కడ రాజయ్య,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.గుర్రం జెలందర్,సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ.
9.కేతావత్ బీక్ సింగ్,సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ.
10.శ్రావణ్ కుమార్,ప్రజాసంఘాల నాయకులు.
11.పోతే ప్రశాంత్,ప్రజాసంఘాల నాయకులు.
12.పూజం రవికుమార్,ప్రజాసంఘాల నాయకులు.
13.గజ్జెల ప్రశాంత్, BSP నాయకులు. గర్జనపల్లి.
14.లింగంపల్లి రాజేందర్,BSP నాయకులు. గర్జనపల్లి.
15.గుంటిక రవి,BSP నాయకులు.
16.మానువాడ లచ్చయ్య, దళిత సంఘం,గర్జనపల్లి.

సాయంత్రం 5;00 గంటలు,26 సెప్టెంబర్,2021 ఆదివారం.
గర్జనపల్లి గ్రామం, వీర్నపల్లి మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లా,తెలంగాణ రాష్ట్రం....

Comments