16 ప్రజా సంఘాల నిషేధంపై వెనక్కి!
ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
జాబితాలో విరసం, పౌర హక్కుల సంఘం, టీవీవీ,
తెలంగాణ ప్రజాఫ్రంట్, తుడుందెబ్బ తదితరాలు
నిషేధంపై హైకోర్టు వివరణ అడిగిన నేపథ్యంలో
ఉత్తర్వులు ఉపసంహరించుకున్న ప్రభుత్వం!
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయంటూ 16 ప్రజా సంఘాలపై ఏడాది పాటు విధించిన నిషేధం విషయంలో ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఉత్తర్వులు జారీ చేసిన మూడు నెలల తర్వాత.. నిషేఽధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డిని ఆదేశించారు. గత నెల 23న జారీ చేసిన గెజిట్ను ప్రభుత్వం మంగళవారం మీడియాకు విడుదల చేసింది.
తెలంగాణ ప్రజా భద్రతా చట్టం- 1992 ప్రకారం.. 16 ప్రజా సంఘాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం మార్చి 30న జీవో 73ను జారీ చేసింది. అవన్నీ మావోయిస్టు పార్టీ అనుబంధమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేసింది. బీమా-కోరెగావ్ కేసు, ఉపా చట్టం కింద అరెస్టయిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబ, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొంది.
ప్రభుత్వానికి సంఘాల లేఖలు.. సుప్రీం సీజేకు వినతి
నిషేధం విధించడాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ప్రభుత్వం గొంతు నొక్కుతోందని విమర్శించాయి. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలంటూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్కు వేర్వేరుగా లేఖలు రాశాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రతినిధులు.. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. మరోవైపు ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా నిషేధం విధించిందని అమరుల బంధుమిత్రుల సంఘం హై కోర్టును ఆశ్రయించింది. జీవో నం.73ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డికి జూన్ 9న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, హైకోర్టులో విచారణ నేపథ్యంలోనే 16 ప్రజాసంఘాలపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది.
నిషేధం ఎత్తివేసిన ప్రజా సంఘాలివే!
విప్లవ రచయితల సంఘం (విరసం), తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ); డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డీఎ్సయూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్); ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఏఎ్సయూ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్); తుడుం దెబ్బ, ప్రజా కళామండలి (పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్ ), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సిస్ (ఎఫ్ఏహెచ్ఎ్ఫవో), పౌర హక్కుల సంఘం (సీఎల్సీ), అమరుల బంధుమిత్రుల సంఘం (ఏబీఎం ఎస్); చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్).
మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో, పదహారు ప్రజాసంఘాలపై ఏడాది పాటు నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఎత్తివేసింది. తప్పు సరిదిద్దుకోవడం మంచిదే. నిషేధిత ఉత్తర్వులు జారీచేసిన మూడునెలల్లో ఏ కారణాలవల్లనైతేనేమి ప్రభుత్వం వాటి ఉపసంహరణకు సిద్ధపడింది. మార్చి 30న పదహారు ప్రజాసంఘాలపై విధించిన నిషేధాన్ని రెండువారాల క్రితం విడుదల చేసిన 122జీవో ద్వారా ఎత్తివేసిన విషయాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెల్లడించింది. ఆయా ప్రజాసంఘాల, మేధావుల, పౌరహక్కుల నాయకుల ఒత్తిళ్ళతో పాటు, రాజకీయ అవసరాలు, ఎత్తుగడలు, న్యాయపరమైన అంశాలు కూడా ప్రభుత్వాన్ని ఇందుకు పురిగొల్పి ఉండవచ్చు.
విప్లవరచయితల సంఘం, పౌరహక్కుల సంఘం ఇత్యాది పదహారు సంఘాలూ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపణ. బీమాకోరేగావ్ కేసులో ‘ఊపా’ కింద అరెస్టయిన వరవరరావు, సాయిబాబా వంటివారి విడుదలకు ఈ సంఘాలు పట్టుబట్టడాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రజాస్వామ్యప్రియులంతా ఈ నిషేధాన్ని నిరసించడం, ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు అభ్యర్థనలు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు సైతం వినతిపత్రం ఇచ్చారు, హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. మార్చి 31న ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు చోట్ల పలువురు ప్రజాసంఘాల నేతల ఇళ్ళల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి, హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోనూ వాటిని కొనసాగించిన నేపథ్యంలో, ఆ తేదీకి ఒకరోజు ముందునుంచీ నిషేధం అమల్లోకి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేయడం విశేషం. సాధారణ పరిపాలనాశాఖ మార్చి 30వతేదీతో ఈ జీవో జారీ చేసిన విషయం ఏప్రిల్ 23వరకూ బాహ్యప్రపంచానికి తెలియచేయలేదు. చట్టవ్యతిరేకమని ప్రకటించే అధికారం ప్రజాభద్రతాచట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉండవచ్చుకానీ, తదనుగుణంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన ప్రక్రియలూ కొన్ని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో పలు సెక్షన్లను ఉల్లంఘించిందన్న విమర్శలూ ఉన్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, పత్రికల్లో ప్రకటనలు ప్రచురించడం, అభ్యంతరాలకు అవకాశం కల్పించడం, ఆయా సంస్థల వాదనలు వినేందుకు న్యాయమూర్తుల కమిటీ వేయడం వంటివి అనేకం అందులో ఉన్నాయి. ప్రభుత్వం ఇవేమీ పాటించలేదు. 2005లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవరచయితల సంఘాన్ని నిషేధిస్తే, ముగ్గురు న్యాయమూర్తుల సలహామండలి విచారణ జరిపి నిషేధం చెల్లదని ప్రకటించడంతో ప్రభుత్వం రెండునెలల్లోనే మరో జీవో తెచ్చి నిషేధాన్ని ఉపసంహరించుకున్నది. ఇప్పుడు అదే సెక్షన్ కింద మరోమారు ఆ సంఘాన్ని తెలంగాణ నిషేధించింది.
ఆదివాసులు, రైతుకూలీలు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు తదితరుల పక్షాన వేర్వేరు ఆశయాలతో పనిచేస్తున్న సంఘాలన్నింటినీ ఏకగాటన కట్టడం, అవి హింసకు పాల్పడుతున్నాయనడం నిషేధానికి సహేతుకమైన కారణాలు కాబోవు. ప్రదర్శనలు చేయడం, ప్రశ్నించడం, క్రూర చట్టాలను నిరసించడం, వ్యవసాయచట్టాలు, సీఏఏ, ఎన్ఆర్సి వంటివి వద్దనడం దేశద్రోహమేమీ కాదు. బీమా కోరేగావ్ కేసులో, బెయిల్ కూడా దక్కని స్థితిలో తొమ్మిదినెలలు విచారణ లేకుండా జైల్లో మగ్గి, కరోనా దుష్ప్రభావంతో స్టాన్స్వామి కన్నుమూసిన ఘటన ఊపావంటి క్రూరచట్టాల నిషేధం అవసరాన్ని మరోమారు విస్పష్టంగా తెలియచెప్పింది. టాడా, పోటాలను మించిన రాక్షసత్వం, నిరంకుశత్వం దీనిలో ఉన్నాయి. స్టాన్స్వామి మరణం మిగల్చిన విషాదవాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కాస్తంత ఓదార్పునిచ్చింది. ప్రజలపక్షాన నిలుస్తున్న గొంతులను నులిమివేయాలనే ప్రయత్నం మాని, ప్రజాసంఘాలు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.
Comments
Post a Comment