దుడ్డు ప్రభాకర్ అక్రమ అరెస్ట్ | పౌర హక్కుల సంఘం

ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ 

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్న వారి అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుతో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. రాజ్యాంగ వ్యతిరేకమైన యూఏపీఏ చట్టాన్ని మోపుతూ ఏపీ పాలకులు అక్రమ అరెస్టులు సాగిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 27న‌ అమరుల బంధు మిత్రుల సంఘం అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ
అదే రోజు చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి అరెస్టులతో ప్రారంభమైన ఈ అరెస్టుల పరంపర ఈ రోజు(జనవరి6) దుడ్డు ప్రభాకర్ అరెస్టుతో కొనసాగుతున్నది. ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడలోని తన ఇంటి నుండి పిడుగురాళ్ల పోలీసులమని చెప్పి వచ్చిన కొందరు ఆయనను తీసుకెళ్ళారు. ఇంట్లో పుస్తకాలు , ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను వెంట రానివ్వలేదు.

ఈ అరెస్టును ఏపీ, తెలంగాణలకు చెందిన ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పలు సంఘాలు డిమా‍ండ్ చేశారు.


ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ గారిని ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడలోని తమ ఇంటి నుండి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.పిడుగురాళ్ల పోలిసులమని చెప్పి, ఏదో కేస్ ఉందని చెప్పి తీసుకెళ్లారు.కుటుంబ సభ్యులను వెంట రానివ్వలేదు ఇంట్లో పుస్తకాలు , ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లారు. దీన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.

గత నెల రోజులుగా AP లో జగన్ ప్రభుత్వం ప్రజాసంఘాల నాయకులను టార్గెట్ చేసి ఇప్పటికి 10మందిని అరెస్ట్ చేసింది. ఉపా లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో నిర్భందించడం ప్రజాస్వామ్యమా?

రాజన్న రాజ్యం అంటే ఇదేనా? వీరు ఎట్లా దేశద్రోహులో, వీరు చేసిన ద్రోహమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రజలపై నిర్భంధం ప్రయోగించి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేసిన నియంతలు చరిత్రలో ఏమయ్యారో ఒక సారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ అక్రమ అరెస్తులను ఆపలని, అరెస్ట్ చేసిన వారందరిని బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.

దుడ్డు ప్రభాకర్ అక్రమ ఆరెస్టును ఖండిద్దాం 

కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడి ,పిడికెడు ఆత్మగౌరవం కోసం అగ్రకుల మనువాదులతో కలబడుతున్న దళిత పీడిత కులాలకు అండగా నిలబడి , కుల నిర్మూలన కోసం పోరాడుతున్న దుడ్డు ప్రభాకర్ ను మళ్లీ అక్రమంగా , అన్యాయంగా అరెస్ట్ చేశారు. మనువాదులు , దోపిడీ వర్గాలు దళిత ,పీడిత కులాల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ అత్యాచార హత్యలకు తెగబడుతున్నప్పుడు బాదితులకు అండగా KNPS నిలబడి పోరాడుతోంది. దోషులను శిక్షించమని బాధితులతో కలిసి ఉద్యమిస్తోంది. దోషులను అరెస్ట్ చేసి శిక్షించడం ఇష్టం లేని పాలకులు పోలీసులు ఇలా ప్రజాసంఘాల నేతలను అక్రమంగా నిర్బంధిస్తారు. జగన్ పాలనలో నేడు ఆంద్రప్రదేశ్ అంతటా అత్యాచార హత్యలు , భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. దేవాలయాల మీద దాడుల పేర దళిత క్రిస్టియన్స్ మీద వేధింపులు మొదలయ్యాయి.వీటన్నింటినీ KNPS ఆంద్రప్రదేశ్ కమిటీ ఖండిస్తూ న్యాయం కోసం పోరాడుతోంది. దోషులను శిక్షించి ప్రజలకు భరోసా ఇవ్వలేని జగన్ ఇలా ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేసి అగ్రకుల దోపిడీదారులను సంతృప్తి పరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన దుడ్డు ప్రభాకర్ ప్రతి అరెస్ట్ వెనుక ఇవే కారణాలు ఉన్నాయి.పోలీసులు , ప్రభుత్వాలు ఏమి చెప్పినా కారణాలు మాత్రం KNPS ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పోరాడడమే అసలు కారణం. అందుకే మళ్లీ ఇలా అరెస్ట్ చేసి మనువాదులను తృప్తి పరచాలనీ జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇలా ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో కుక్కుతున్నారు.ఇది ఎంత మాత్రం ప్రజాస్వామికం కాదు. ఇది ప్రజలమీద దోపిడీని , పీడనలను , కుల హింసలను , లైంగిక హింసలను ప్రభుత్వం పట్టించుకొనట్టే అని అర్ధం చేసుకోవాలి. బాధితుల పక్షాన మాట్లాడే గొంతులను నులిమేస్తున్న పాలకులను ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎనాటికైనా పాలకులకు గుణపాఠం చెబుతారు కూడా. దేశంలో ప్రజాస్వామిక హక్కులను అమలు చెయ్యాలని ప్రజలంతా ఏకమై పాలకులను నిలదియ్యాలని దళిత ,గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాలు , ప్రజాస్వామిక వాదులను కుల నిర్మూలనా పోరాట సమితి (KNPS) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున కోరుతున్నాం.
ప్రజా సంఘాల నేతల అరెస్టులను వెంటనే నిలిపివేయ్యాలి !!
అక్రమ నిర్బందాల్లో ఉన్న ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చెయ్యాలి.

Comments