పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్ధ్యాన్ని పెంచాలి

పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటి ...



శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాంతాలకు తూముల ద్వారా నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ  సరఫరా చేస్తుంది. పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు. నీటి సరఫరాను చేసే నాలుగు తూములను ఏర్పాటు చేశారు. 


శ్రీశైలం జలాశయం నుండి 11500 క్యూసెక్కుల నీటిని కాలువలోకి పారించగలిగే సామర్థ్యం ఇక్కడ ఏర్పాటు చేసిన నాలుగు తూములకు వుంది. కృష్ణా నదిలో ప్రవహించే వరదనీటిని సద్వినియోగం చేసుకునే విధంగా దీనిని రూపోందించారు. చెన్నైకి ఇవ్వవలసిన 15 టి.ఎం.సిల తాగునీటిని ఈ జలాశయం నుండి ఇవ్వాలి.  ఈ రెగ్యులేటర్‌ ద్వారా నీరు శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి వెళ్తుంది. ఈ కాలువ 16.4 కి.మీ పోడవు వుంటుంది. ఇది బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ దగ్గర ముగుస్తుంది. ఇక్కడ మూడు రెగ్యులేటర్లు వుంటాయి. ఇవి శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ కాలువ, గాలేరు-నగరిలకు వెళ్లే కాలువలకు అనుసంధానించబడి వుంటాయి. 


ఆంధ్రప్రదేశ్ వాదన


2005 సెప్టెంబర్ 13 న జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 170ను జారీ చేసింది. దీనిప్రకారం మరో 7 తూములను ఏర్పాటు చేయాలి. దాని సామర్థ్యాన్ని ప్రస్తుత 11500 క్యూసెక్కుల నుండి 40,000 క్యూసెక్కులకు పెంచాలి. తెలుగుగంగ, గాలేరు-నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువలకు అవసరమైన 102 టీఎంసీల నీటిని  వరద వచ్చినపుడు తరలించాలి. వరద వచ్చే 30 రోజుల్లో తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. 


వాస్తవం


రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లివాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచక తప్పదు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేది కేవలం వరద నీరు మాత్రమే. చెన్నైకు తాగునీటి సరఫరాతో సహా తెలుగుగంగకు 45 టీఎంసీలు, గాలేరు-నగరికి 38 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలు అవసరం. మొత్తం 102 టీఎంసీలు అవసరం. నిజానికి ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసినపుడు 45 రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంచనా వేశారు. గత పదేళ్లుగా 25 రోజులకు మించి వరద ప్రవాహం లేదు. ఈ పరిస్థితిలో 25 రోజుల్లో 102 టీఎంసీల నీటిని మళ్లించాలంటే రోజుకు 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం అవసరం అవుతుంది.  శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే 40 వేల క్యూసెక్కులు వెళ్తాయి. కనీస నీటిమట్టం 854 అడుగులు ఉన్నప్పుడు మూడువేల క్యూసెక్కులు మాత్రమే వెళ్తాయి. అందుకే కాలువ సామర్ధ్యాన్ని పెంచకపోతే ఉపయోగం వుండదు. 


తెలంగాణ వాదన


నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. సాగునీటి సరఫరా కూడా తగ్గుతుంది. రాయలసీమకు నీటిని తరలించుకునే హక్కు లేదు. బలవంతంగా గేట్లు ఎత్తి శ్రీశైలం నుంచి సీమకు నీటిని తరలించిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు సామర్థ్యం పెంచితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది.  భవిష్యత్తులో, వరద లేనప్పుడు కూడా మొత్తం నీటిని తీసుకెళ్తారని తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కావాలంటే గోదావరి నీటి జలాలను ఉపయోగించుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది.  


తెలంగాణలోని పార్టీలు ఇంకా ఇలా వాదిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మహా అయితే 40వేల క్యూసెక్కుల మించికి పెంచకూడదు. నిజానికి ఇది నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల నీటివిడుదల సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. రాయలసీమలోని 7.25లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ఉద్దేశ్యాన్ని జీవో 170లోనే చెప్పారు. నీటిపారుదలకు నికరజలాలు (ఎస్యూర్డ్‌ ఇరిగేషన్‌ ఫెసిలిటీ) ఇస్తున్నట్టు ఆ జీవోలో పేర్కోన్నారు. రాజోలిబండ మళ్లింపు పథకం విషయంలో కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు కొట్లాడుకోవటం మర్చిపోవద్దు. పోతిరెడ్డిపాడు ఫలితంగా సాగర్‌, కృష్ణాడెల్టా ఆయకట్టుకు నీరు తగ్గిపోతుంది. శ్రీశైలం, సాగర్, ప్రకాశం బారేజిలలో పూర్తిస్థాయిలో నీళ్లుంటేనే,  పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల జరగాలి. అప్పుడే వరదనీరిచ్చినట్లు అవుతుంది. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే జంటనగరాలకు కృష్ణానీళ్లు తేవటం సాధ్యం కాదు. అసలు కృష్ణాజలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 800 టీఎంసీల్లో ఏప్రాంతానికి ఎంతన్న విషయాన్నీ ఇప్పటివరకు తేల్చలేదు. 


ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ లేఖలోని అంశాలు


తెలంగాణ చేపట్టిన నీటి పథకాల వల్ల అనేక జిల్లాలు నీటిని కోల్పోతాయని రాష్ట్ర అధికారులు కేఆర్‌ఎంబీకి తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టును అమలు చేయడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు హాని జరగదని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ (డబ్ల్యుఆర్డి) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కెఆర్ఎంబి)కు తెలియజేసింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చడానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పలు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆ శాఖ ఫిర్యాదు చేసింది.


KRMB చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా మరియు అపెక్స్ కౌన్సిల్ నుండి అవసరమైన ఆమోదాలు పొందకుండా వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్టులు (DPR) ఉంచబడకుండా ఉండటానికి KRMB, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కు ఆంధ్రప్రదేశ్ పదేపదే విజ్ఞప్తి చేసింది. అయినా పొరుగు రాష్ట్రం అనేక ప్రాజెక్టులతో ముందుకు సాగుతోందని WRD ఎత్తి చూపింది.


KRMB కి రాసిన లేఖలో, WRD 800 అడుగుల స్థాయిలో పోతిరెడ్డిపాడు నుండి నీటిని తీయడానికి తెలంగాణలో అనేక  పంప్ హౌస్‌లు ఉన్నాయి. ఇది 796 అడుగుల స్థాయి నుండి విద్యుత్ ఉత్పత్తికి 42,000 క్యూసెక్లను కూడా డ్రా చేయగలదని లేఖలో పేర్కొంది. తెలంగాణ వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తాగు మరియు నీటిపారుదల నీటిని కోల్పోతాయి అని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేెశ్ కు నీరు కావాలంటే జలాశయం నీటి మట్టం 881 అడుగుల పైన వుండాలి. నీటిమట్టం 881 అడుగుల స్థాయి నుండి 854 అడుగులకు పడిపోతే నీటిని తరలించడం సాధ్యంకాదు. 


పోతిరేడిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా  వరద జలాల లభ్యత  సంవత్సరంలో సగటున 15 రోజులకు మించి వుండటం లేదు. 15 రోజులలోనే ఆంధ్రప్రదేశ్ తన వాటాను తీసుకోలేకపోతోందని, డబ్ల్యుఆర్డి అధికారులు వాదించారు. ఎపి, తెలంగాణ ప్లాన్ చేసిన కొత్త ప్రాజెక్టుల ప్రణాళికను ఎపి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం KRMB, CWC,  అపెక్స్ కౌన్సిల్ సిఫారసు చేయాలని WRD తెలిపింది.


తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించిందా 


తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించింది. విభజన తరువాత, మిగులు నీటిపై ఆధారపడిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు,  పాలమురు-రంగారెడ్డి, దిండి, భక్తా రమదాస్, తుమ్మిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ప్రభుత్వం చేపట్టింది. కృష్ణ వాటర్స్ వివాదాల ట్రిబ్యునల్ 1, KRMB, CWC, అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతులు లేకుండా ఈ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా, ముందస్తు అనుమతి లేకుండా తెలంగాణ కల్వాకుర్తి, నెట్టంపాడు లిఫ్ట్ పథకాలు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పరిధిని పెంచింది. పైన పేర్కొన్న అన్ని ప్రాజెక్టుల డిపిఆర్‌లను కెఆర్‌ఎమ్‌బి, సిడబ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ ముందు పరిశీలన కోసం ఉంచాలని  డబ్ల్యుఆర్‌డి లేఖలో పేర్కోంది. 


ప్రజాసంఘాల వాదన 


తగ్గుతున్న వరద రోజులను దృష్టిలో ఉంచుకుని రాయలసీమలో కృష్ణ మిగులు నీటిని ఉపయోగించి నిర్మించిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు నీటిని అందించాల్సిన అవసరం వుంది. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పిహెచ్ఆర్) విస్తరణ వల్లే సాధ్యమవుతుంది. ప్రస్తుతమున్న 44,000 క్యూసెక్ ల  నుండి ఉత్పత్తి సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచాలి. రాయలసీమ ప్రాంతానికి  తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడానికి ఇది అవసరం. లేకపోతే రాయలసీమ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకు అవసరమైన నీటిని సరఫరా చేయలేము. 


పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచెర్లా రెగ్యులేటర్ కాంప్లెక్స్‌ను అప్‌గ్రేడ్ కు, కాలువల అభివృద్ధికి సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.  రాయలసీమ ప్రాంత ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు కోసం దాదాపు 80,000 ఎకరాలను త్యాగం చేశారు. అయినా సరైన నీటి కేటాయింపులు జరగలేదు. ప్రాజెక్టులకు నీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, రాయలసీమ  హక్కు వాటాగను గుర్తించాలి. అసలు రాయలసీమకు హక్కే లేదనడం సరైనది కాదు.  


2005 సెప్టెంబర్ 13 న జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 170ను జారీ చేసింది. ఆ సమయంలో, 30 రోజుల్లో 102 టిఎంసి (తెలుగు గంగా ప్రాజెక్టుకు 40 టిఎంసి, జిఎన్‌ఎస్‌ఎస్‌కు 38 టిఎంసి, ఎస్‌ఆర్‌బిసికి 19 టిఎంసి అందించాలని, ఉత్పత్తి రేటు రోజుకు 40,000 క్యూసెక్లుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇది 880 అడుగుల నీటి మట్టంలో మాత్రమే సాధ్యమవుతుంది. 854 అడుగుల స్థాయిలో, 3,000 క్యూసెక్లను మాత్రమే విడుదల చేయవచ్చు. అందువల్ల పిహెచ్ఆర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.


నిజానికి ఈ రోజు పరిస్థితిలు మరింత దిగజారాయి. కర్ణాటకలోని అల్మట్టి ఆనకట్ట  ఎత్తు ఐదు మీటర్ల నుండి 534 కు పెరగడంతో, వరద నీరు వచ్చే రోజులు మరింత తగ్గాయి. శ్రీశైలం ప్రాజెక్టు  అప్‌స్ట్రీమ్ లో నిర్మించిన అనేక ప్రాజెక్టులు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ప్రతి సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యం తగ్గుతోంది. 2011 లో 308 టిఎంసి వాస్తవ నిల్వ సామర్ధ్యం వుంది. తర్వాత  215 కి తగ్గింది.  


ఈ ప్రాజెక్టుపై వరద పీడనం తగ్గించడానికి పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్‌ను వెడల్పు చేయాల్సిన అవసరం వుంది.  శ్రీశైలం ఆనకట్ట భద్రతకు ముప్పుగా పరిమణిస్తుందనే మాటల్లో అర్ధం లేదు.  గోదావరి నుండి కృష్ణకు పోలవరం ద్వారా మళ్లించబడే 80 టిఎంసి నీటిని మళ్లించాలని ఇప్పటికే ప్రతిపాదించబడింది. అదే మొత్తాన్ని రాయలసీమ నీటిపారుదల అవసరాలకు ఉపయోగించాల్సి ఉంది. గోదావరి నీటిని దుమ్ముగుదెం నుండి మళ్లించాలి. ఇది 160 టిఎంసి కంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల, పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడానికి పిహెచ్ఆర్ సామర్థ్యాన్ని పెంచడం అవసరం.  


ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై రాయలసీమ ప్రజలు సంతోషించారు.  అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ప్రజలు భావిస్తున్నారు. నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు. అయితే రాయలసీమకు ప్రయోజనం తక్షణమే వుండదు.  శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం సాధ్యం అవుతుంది.  గత 5 సంవత్సరాలలో ఏడాదిలో 10 రోజులకు మించి వరదలు రాలేదు. 10 రోజుల్లో వరదనీటిని రాయలసీమకు తరలించడం కష్టం. మరోవైపు నిల్వ చేసుకోగల సామర్థ్యం  రాయలసీమలో వున్న జలాశయాలకు లేదు.  ఈ నేపథ్యంలో జలాశయాల సామర్థ్యాన్ని పెంచాలి. 


రాయలసీమకు నీరందిస్తాం, వృథాగా పోతున్న గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకుందాం అని కేసీఆర్ అన్నారు.  పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జారీ చేసిన జీవో రాజకీయ వివాదానికి దారితీసింది.  గోరుకల్లు జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు కాగా 8 టీఎంసీలే నింపుకోగలుగుతున్నారు. గండికోటలో దాదాపు 27 టీఎంసీలకు గాను 11 టీఎంసీలు, చిత్రావతి రిజర్వాయరులో పది టీఎంసీలకు గాను 6, సర్వరాయ సాగర్‌లో మూడు టీఎంసీలకుగాను ఒకటిన్నర, బ్రహ్మంసాగర్‌లో 17.7 టీఎంసీలకు గాను పది టీఎంసీలను మాత్రమే నింపుకోగలుగుతున్నారు. అంటే 70 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37 టీఎంసీలకు మించి నింపుకోలేని పరిస్థితి.  ప్రస్తుత రిజర్వాయర్లను పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించలేకపోవడానికి పునరావాస ప్యాకేజీ అమలు చేయకపోవడమే కారణం. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల దిగువకు పడిపోతే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించలేరు.


చంద్రబాబునాయుడు 2017లో చడీచప్పుడు లేకుండా 200 కోట్లు ఖర్చు చేసి ముచ్చుమర్రి లిఫ్ట్‌ను పూర్తిచేశారు. దీనివల్ల 810 అడుగులకు నీటిమట్టం పడిపోయినా శ్రీశైలం నుంచి నీరు పోసుకోవచ్చని తేదేపా చెపుతోంది. ఈ పథకం ద్వారా 2017–18, 2018–19లో దాదాపు మూడు టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని తేదేపా చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సుమారు 6,800 కోట్ల అంచనా వ్యయంతో  పోతి రెడ్డిపాడు విస్తరణ పథకం చెపట్టింది. పాలకులు తమ స్వంత ప్రయోజనాల కోసమే ప్రజలు అవసరాలతో, భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 


టి.ఎం.సి అంటే (Thousand Million Cubic Feet) శతకోటి ఘనపుటడుగులు. ఘనపరిమాణపు కొలత.


క్యూసెక్కు అంటే క్యూబిక్ ఫుట్/సెకండు. ప్రవాహపు రేటు కొలత. 1 క్యూసెక్కు అంటే  28.317 లీటర్లు/సెకండు


-  అమన్ 

Comments